ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకొనేందుకు ఈ నెల 7,8 తేదీల్లో మరో అవకాశాన్ని ఇస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా ప్రకటించారు. మీనా విజయనగరం జిల్లా కేంద్రంలో జెఎన్టియు గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను సందర్శించారు.
ఓటింగ్కు చేసిన ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్లు, క్యూలెన్లు, పోలింగ్ బూత్లను సందర్శించారు. ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలను, ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఏర్పాట్లపట్ల ఉద్యోగులు సిఇఓ వద్ద సంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లాలో పోస్టల్ ఓటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను, ఎన్నికలు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి వివరించారు .
పోస్టల్ ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు, ఓటు కోసం ధరఖాస్తు చేసుకోని వారు సైతం తమ ఎన్నికల డ్యూటీ ఆర్డర్, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేషన్ సెంటర్కు తీసుకువెళ్లి, ఓటు పొందవచ్చునని సూచించారు. ఇలాంటి వారి కోసం ఈ నెల 7,8 తేదీల్లో ఓటు వేయడానికి అవకాశం ఇస్తామని తెలిపారు. అన్నిఫెసిలిటేషన్ సెంటర్లలో కనీస మౌలిక సదుపాయాలను, హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల శిక్షణ పూర్తయ్యిందన్నారు. వివిధ విభాగాలనుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని, సి-విజిల్ ద్వారా ఎక్కువ ఫిర్యాదుల అందుతున్నాయని అన్నారు. ఇప్పటివరకు సుమారు 16000 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో 99 శాతం ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.
స్వయంగా తమ కార్యాలయానికే 500 ఫిర్యాదులు అందాయని, వీటిలో 450 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ఫిర్యాదు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందుగా సంబంధిత పోస్టులను ఆ సోషల్ మీడియా వేదికల నుంచి తొలగిస్తున్నామని, సంబంధిత పార్టీ లేదా అభ్యర్ధిపై కేసులు నమోదు చేస్తున్నామని వివరించారు.