ఈ నెల 8 న నామినేషన్ వేసే అవకాశం
కామారెడ్డి అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి చిక్కుముడి వీడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం సాగినా చివరికి అదే నిజమైందని ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారనే ప్రచారంతో ఎటు తేలక పోవడంతో షబ్బీర్ అలీ న్యూట్రల్ గా ఉండిపోయాడు. దాంతో అసలేం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. ఎట్టకేలకు పార్టీ అధిష్టానం సీఎం కేసీఆర్ పై బలమైన నేతను రంగంలోకి దింపేలా చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ కు చెక్ పెట్టేలా రేవంత్ రెడ్డిని పోటీలోకి దించనుంది. ఇప్పటికే ఈ విషయం కామారెడ్డి ముఖ్య నాయకులు, కార్యకర్తలకు చేరవేసినట్టుగా తెలుస్తోంది. ఎలాగైనా కామారెడ్డి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా భారీ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది.
ఇన్నాళ్ల పాటు సస్పెన్స్ కొనసాగించిన పార్టీ నామినేషన్స్ వేసే సమయంలో అభ్యర్థిపై స్పష్టత ఇచ్చింది. ఈ నెల 6 న కొడంగల్ లో, 8 న కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ప్రచార బాధ్యతలు షబ్బీర్ ఆలీకి అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. లేదా నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీని పోటీలో ఉంచే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో కామారెడ్డిలో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. ముఖ్య నేతలంతా కామారెడ్డి కేంద్రంగా ప్రచారం కొనసాగించనున్నారు. కామారెడ్డిలో ఎన్నికల నాటికి మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక సభలో పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి, మరో రెండు సభలకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది.
సత్యం న్యూస్, కామారెడ్డి