ఈరోజు ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా నేత్ర వైద్య శిబిరాన్ని ములుగు ఎస్పి డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఐపీఎస్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలు సమాజంతో కలిసిపోయి విద్య,వైద్యం వంటి అనేక ప్రభుత్వం అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
కేవలం విద్యా వికాసం ద్వారానే మంచిచెడులను తెలుసుకోగలరని తద్వారా సంఘవిద్రోహ శక్తుల బారిన పడకుండా ఉండగలరని సూచించారు. ఆదివాసి ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఆదివాసీ ప్రజల శ్రేయస్సుకోసం పాటుపడుతుందని అనేక సేవా కార్యక్రమాల ద్వారా గిరిజన ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు. పరిశుభ్రత, పోషకాహారం తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలనుండి బయట పడవచ్చు అన్నారు.
స్వచ్ఛమైన వాతావరణంలో నివసించడం, శారీరక శ్రమ వలన గిరిజన ప్రజలలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని తెలిపారు. ఈ నేత్ర వైద్య శిబిరానికి సహకరించిన కాకతీయ కంటి ఆస్పత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ములుగు ఏ ఎస్పి పోతరాజు సాయి చైతన్య మాట్లాడుతూ గత నెల కాల్వపల్లి గ్రామానికి వచ్చి బడే బతుకమ్మను కలిసినప్పుడు కంటి సమస్యతో బాధపడుతున్నధని గుర్తించి ఎస్పీ సలహా మేరకు గ్రామంలో ప్రతి ఒక్కరికి కంటి వైద్యం అందించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని దీనికి సహకరించిన కాకతీయ కంటి వైద్యశాల ,హనుమకొండ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయడానికి కూడా ఆసుపత్రి వారు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని మందులను జాగ్రత్తగా డాక్టర్ సలహా మేరకు ఉపయోగించుకోవాలని గ్రామ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది గిరిజన ప్రజలకు వైద్యుల ద్వారా నేత్ర మరియు ఇతర సమస్యలపై వైద్య సహాయం మరియు సుమారు 80 వేల రూపాయల విలువగల మందుల పంపిణీ చేశారు.
ఈ వైద్య శిబిర కార్యక్రమానికి ములుగు జిల్లా ఓఎస్డి శోభన్ కుమార్, వైస్ జెడ్పి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి,సి ఐ అనుముల శ్రీనివాస్, ఎస్ ఐ వెంకటేశ్వర్లు,పసర ఎస్సై రవీందర్, పి ఎస్ ఐ లు,వైద్యులు అవినాష్,మధు, సుకుమార్, కాకతీయ కంటి ఆసుపత్రి సిబ్బంది, ప్రభుత్వ వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.