అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలో లో అద్భుత శిల్పకళా సంపదతో అలరారు తున్న చారిత్రక ప్రసిద్ధి చెందిన సౌందర్య వళ్లి సమేత శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 27న మొదలై జులై నెల 7 వతేది వరకు నిర్వహించ నున్నారు.ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఉభయ దాతలు నందలూరు మండల అధ్యక్షుడు మేడా విజయ బాస్కర్ రెడ్డి,పద్మజా దంపతులు స్వామి వారి కల్యాణం కోసం ముత్యాల తలంబ్రాలు,పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు,పురోహితులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.ఆలయ ప్రదక్షిణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.టీటీడీ సూపర్నిడెంట్ వెంకటేష్,సౌమ్యనాధ ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ రాజ్,ఆలయ ప్రధాన అర్చకులు సునీల్ శర్మ,ఉప ప్రధాన అర్చకులు సాయి కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించు కుంటారు.
ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు.ప్రత్యేక బస్సులతో, త్రాగునీరు, అన్న ప్రసాదాల కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, రంగు రంగుల విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు. టీటీడీ వారు ఇటీవల ఆలయంను తమ స్వాధీనం చేసుకున్నారు.
వారి ఆధ్వర్యంలో ఈ యేడాది బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించ నున్నారు. ఈనెల 27 వతేది అంకురార్పణ తో మొదలై జులై 4 వతేది కల్యాణం,5 న రథోత్సవం,7 వతేది పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియ నున్నాయి.