అపరోక్ష జ్ఞానులు, శ్రీ గోపాల విఠల బిరుదాంకితుడైన గణేశాంశ సంభూతులు శ్రీ గోపాల దాసుల ఆరాధనోత్సవాలు ఉత్తనూర్ గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి. ఐజ మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న ఉత్తనూర్ గ్రామం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. శ్రీ గోపాల దాసులచే పూజలు అందుకున్న శ్రీ ధన్వంతరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఉన్న శ్రీ గోపాల దాసుల సన్నిధానంలో ఆదివారం మధ్య ఆరాధన సందర్భంగా శ్రీ గోపాల దాసుల వంశస్థులు స్వామివారికి అభిషేకాలు పూజలు అష్టోత్తర పారాయణాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అనేకమంది భక్తుల మధ్య స్వామివారు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయకులు రాయిచూర్ శేషగిరిరావు హాజరై దాసులు రచించిన పాటలను తన గానముతో వినిపించారు. సోమవారం ఉత్తరారాధన సందర్భంగా ప్రత్యేక పూజలు పురాణ ప్రవచనాలతో ఆరాధన ఉత్సవాలు పూర్తికానున్నాయి. దాసుల వారి ఆరాధన ఉత్సవాలకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల బ్రాహ్మణ భక్తులు అనేకమంది పాల్గొంటున్నారు.