ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం జరిగింది. వివేకానంద రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు గంగిరెడ్డికి మంజూరైన బెయిల్ రద్దు అంశంపై విచారణను తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరపాలని తీర్పు చెప్పారు.
కేసు ట్రయల్ ను తెలంగాణకు బదిలీ చేసిన నేపథ్యంలో బెయిల్ రద్దు అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టులో తేల్చాలని ఆదేశం ఇచ్చారు. నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడిన సందర్భంలో చార్జిషీటు దాఖలు చేయలేదన్న కారణంతో కేసులోని మెరిట్స్ను పరిగణలోకి తీసుకోకుండా డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం తగదని కోర్టు వ్యాఖ్యానించింది. కేసులోని మెరిట్స్ ఆధారంగా బెయిల్ అంశంపై మరోసారి విచారణ చేపట్టాలని కూడా తీర్పులో పేర్కొన్నారు.
డిఫాల్ట్ బెయిల్ పొందిన వ్యక్తి విచారణకు సహకరించని పక్షంలో బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. 90 రోజులలోపు దాఖలు చేయనందున చార్జిషీట్ను సమర్పించిన తర్వాత బెయిల్ను రద్దు చేయవచ్చా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తింది. ఒక వ్యక్తి డిఫాల్ట్ బెయిల్పై విడుదలైన తర్వాత.. విచారణకు సహకరించక పోవడం వంటి మెరిట్, ఇతర కారణాలతో దానిని తిరస్కరించకూడదు అన్న నిషేధం లేదు.
నిందితుడు నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడ్డాడు, అతని బెయిల్ మంజూరుకు మెరిట్నే పరిగణించాల్సి ఉంటుంది. కేసులో ఆధారాలు బలంగా ఉన్నప్పుడు చార్జిషీట్ దాఖలు చేయకపోవడం సరైన పద్దతి కాదు. చట్టం ప్రకారం, మెరిట్ ఆధారంగా బెయిల్ రద్దు విషయాన్ని తిరిగి పరిశీలించడానికి పిటిషన్ను జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తెలంగాణ హైకోర్టుకు రిమాండ్ చేశారు. తదుపరి విచారణ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.