ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి జి. పాణిని ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు రెండవ రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. దీనిలో డీఈఓ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో శిక్షణ పొందుతున్న మండల స్థాయి కార్యకర్తలు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, చెప్పిన విషయాలు మండల స్థాయి శిక్షణలో ఉపయోగించాలని కోరారు.
ఈ కార్యక్రమం ప్రతి పాఠశాలలో ఆగస్టు 15 రోజున ప్రారంభం చేయడం జరుగుతుందని చెప్పారు. దీనికి గ్రామంలోని తల్లిదండ్రులను, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పారు. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో ఆగస్టు 3 నుంచి ఆరో తారీకు వరకు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని, దీని ఆధారంగా తొలిమెట్టు కార్యక్రమాన్ని ఒక సంవత్సరం పాటు నిర్వహించి విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి ప్రయత్నం చేయాలని చెప్పారు.
తరగతి గదిలో ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పాఠ్య ప్రణాళిక రూపొందించుకొని బోధనాభ్యసన ప్రక్రియను చేపట్టాలని సూచించారు. తమకు సంబంధించిన యూనిట్ ప్రణాళిక రూపొందించుకొని తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అదేవిధంగా విద్యార్థుల యొక్క ప్రగతిని నెలకు ఒకసారి రికార్డులలో నమోదు చేయాలన్నారు.
విద్యార్థులు ప్రగతిని అంచనా వేయడానికి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, కాంప్లెక్స్ స్థాయిలో పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, వారు మండలంలో పర్యటించి కార్యక్రమమ ప్రగతిని పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. ఉపాధ్యాయుల యొక్క లక్ష్యం విద్యార్థుల అభ్యసన ఫలితాలు సాధించడం అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తొలిమెట్టు కార్యక్రమం రాష్ట్ర పరిశీలకులు నందకిషోర్, డీఈఓ కార్యాలయ కోఆర్డినేటర్లు సుదర్శన్ రెడ్డి, సాంబయ్య, రమాదేవి, రాజు సౌకర్య కర్తలు శ్రీరంగం, దేవి శ్రీ ప్రసాద్, మధు మాతంగి, రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.