ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో “ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య-విద్యుత్@2047” ఇతివృత్తం లో భాగంగా “బిజ్లీ మహోత్సవ్” వేడుకలను దేశ వ్యాప్తంగా 773 జిల్లాలలో జూలై 25 నుంచి జూలై 30 వరకు జరపనున్నారు.
దేశవ్యాప్తంగా విద్యుత్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సాధించిన విజయాలను ప్రదర్శించేందుకు ఎన్టీపీసీ రామగుండం ఎంప్లాయీ డెవలప్మెంట్ సెంటర్ (ఈడీసీ) ఆడిటోరియంలో ఈ రోజు ‘ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్య’ వేడుకలను ఘనంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా సార్వత్రిక గృహ విద్యుదీకరణ(ఆర్ఈసీ), గ్రామాల విద్యుదీకరణ, పంపిణీ వ్యవస్థ బలోపేతం, సామర్థ్య జోడింపు, వన్ నేషన్ వన్ గ్రిడ్, పునరుత్పాదక శక్తి, వినియోగదారు హక్కులు అనే అంశాలపై లఘు చిత్రాలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ డా. అనిల్ కుమార్ తో పాటు మునిసిపల్ కమిషనర్ బి.సుమన్ రావు, అతుల్ కమలాకర్ దేశాయ్, జిఎమ్ (ఓ అండ్ ఎం) లు పాల్గొన్నారు.