విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్నీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ డీసీపీ(లా & ఆర్డర్) గా పనిచేస్తూ పదోన్నతి పై విశాఖకు వచ్చిన ఆయన 2010 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. ఇప్పటి వరకు విశాఖ రేంజ్ ఐజీ గా విధులు నిర్వహిస్తున్న ఎస్.హరికృష్ణ డీజీపీ కార్యాలయంలో ఐజీ పర్సనల్ విభాగానికి బదిలీ చేశారు. ప్రస్తుత విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని 2013 నుండి 2015 వరకు నర్సీపట్నం సబ్ డివిజన్ ఏఎస్పీ గా , పదోన్నతి పై ఓ.ఎస్.డి గా విశాఖపట్నం రూరల్ జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది.
అలాగే విశాఖ రేంజ్ పై అవగాహన కూడా ఉంది. ఈ సందర్భంగా రేంజ్ డీఐజీ ఆఫీసులో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రేంజ్ పరిధిలోని ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తమ శాఖ లోని అన్ని విభాగాలను పట్టిష్ట పరిచేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రజల లక్ష్యంగా పోలీస్ స్టేషన్ స్థాయిలో అందరికీ న్యాయం జరిగేలా చేయటమే తన ప్రథమ కర్తవ్యం అని తెలిపారు. అదేవిధంగా మన్యం, పాడేరు వంటి ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. గంజాయిని నిర్మూలించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెడతానన్నారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తూ ముందుకు వెళతానని అన్నారు. తాను అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, వార్తలు ప్రచురించే ముందు తనను లేదా తమ ఎస్పీ స్థాయి అధికారులను సంప్రదించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని ఈ రోజున సోషల్ మీడియాలో పలువురు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వార్తలు ప్రచురించడం వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారని కావున వార్త ప్రచురించే ముందు దానిని నిజనిర్ధారణ చేసుకోవాలని తద్వారా పత్రికలు విలువలు కూడా పెరుగుతాయని ఆయన మీడియాను కోరారు. \ బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీఐజీని రేంజ్ పరిధిలోని 5 జిల్లాల ఎస్పీలు, పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.