దేశవ్యాప్తంగా ఉన్న టూరిజం ప్రదేశాల్లో గో ఉత్పత్తుల విక్రయానికి స్టాల్స్ ఇప్పించి గో ఉత్పత్తులను ప్రోత్సహించాలని తెలంగాణ గోశాల ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు మహేష్ ఆగ్రవాల్, అధ్యక్షుడు రాజేశ్వర్ రావుల ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సోమవారం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈషాన్య రాష్ట్రల అభివృద్ధి శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మహేష్ అగ్రవాల్ మాట్లాడుతూ గోవుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. ఆవు మూత్రం, ఆవు పేడతో ఎన్నో రకాల వస్తువులను గ్రామీణ ప్రాంతాల్లో గోశాలల ద్వారా తయారు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఫినాయిల్, సబ్బులు, రాఖీలు, విగ్రహాలు, దూప్ స్టిక్స్, పెయింట్స్, దోమల నివారణకు స్టిక్స్, వివిధ రకాల ఔషధాలు తయారు చేస్తూ ఇప్పుడిప్పుడే మార్కెట్ చేస్తున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, దీంతో రానున్న రోజుల్లో మరింత ఉత్పత్తులను పెంచి పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఉంటే వేలాది మందికి ఉద్యోగ ఉపాధి ఆవకాశాలు కల్పించవచ్చునని ప్రజలకు మంచి ఆహార ఉత్పత్తులను అందించవచ్చుని ఆయన తెలిపారు.