సహాయం కావాల్సిన ఒక కుటుంబాన్ని ఆదుకోవడంలో తండ్రీ కూతుళ్ల పోటీ పడ్డారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో జరిగింది. సహాయం కోసం ఎదురు చూస్తున్న కుటుంబాన్ని ఆదుకోవడానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ముందుకు వచ్చేలోపే ఆయన కుమార్తె పవిత్ర సహాయం చేసేసినట్లు చెప్పారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కార్యాలయం ఎదురుగా జిలాని అనే వ్యక్తి చిన్న పండ్ల దుకాణం పెట్టుకుని వ్యాపారం చేసుకునేవాడు.
జిలానీ ఎమ్మెల్యే పై అభిమానంతో ప్రతిరోజు ఆయన వచ్చి వెళ్లే సమయంలో కారు ఆపి మరి పండ్లు ఇచ్చేవాడు. అయితే దురదృష్టవశాత్తు కోవిడ్ కారణంగా జిలాని మృతి చెందాడు. జిలానీకి ఒక బాబు, పాప ఉన్నారు. కుటుంబం గడవడం కష్టం అవ్వడంతో ఎమ్మెల్యే ను ఆశ్రయించారు. పిల్లలకు స్కూలు ఫీజు కట్టేందుకు చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హామీ ఇస్తుండగానే ఆయన కుమార్తె పవిత్ర వచ్చారు. ‘‘నేను ఇప్పటికే ఫీజు చెల్లించేశాను’’ అంటూ తండ్రికి చెప్పారు.
దాంతో సంతోషపడ్డ ఎమ్మెల్యే కుమార్తెకు తదుపరి చర్యలు కూడా జాగ్రత్తగా తీసుకోవాలని సూచించారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కూడా కుమార్తెకు చెప్పారు. జిలానీ పిల్లలకు అయ్యే చదువు ఖర్చును తానే చూసుకుంటానని అలాగే వారి భార్యకు ఉద్యోగం, ఇంకనూ వారికి ఏ సమస్య ఉన్నా తన బిడ్డ పవిత్రమ్మ చూసుకుంటారు అని ఎమ్మెల్యే తెలిపారు. మనిషి బ్రతికున్నప్పుడు అందరూ ఉంటారు, మనిషి చనిపోయాక వారి కుటుంబానికి తోడుగా అండగా నిలవడమే నిజమైన మానవత్వం అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.