ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వచ్చే ఆరోపణలను పాజిటివ్గా తీసుకుందామని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఆరోపణల్లో నిజం ఉంటే సరిచేసుకుందామని జిల్లా కలెక్టర్లకు ఆయన సూచించారు. వివిధ కారణాలతో సంక్షేమ పథకాలు అందనివారికి సీఎం నిధులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.79లక్షల మంది లబ్ధిదారులకు రూ.590కోట్ల నిధులు వారి ఖాతాల్లో జమకానున్నాయి.
జగనన్న చేదోడు, వైఎస్సార్ మత్స్యకార భరోసా, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి, వైఎస్సార్ కాపునేస్తం సహా పలు పథకాల ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి నేరుగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ నష్టపోకూడదన్నారు. సంక్షేమ పథకాల అమల్లో జిల్లా కలెక్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని.. వారి కృషి వల్లే గొప్ప వ్యవస్థ తీసుకురాగలిగామని చెప్పారు.
కలెక్టర్లు బాగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. ‘‘ఏ మంచిపని చేసినా వక్రీకరిస్తున్నారు. ప్రతిదీ పాజిటివ్గానే తీసుకుందాం. ఆరోపణల్లో నిజం ఉంటే కరెక్ట్ చేసుకుందాం. అందులో వాస్తవం లేకపోతే ప్రెస్మీట్ పెట్టి గట్టిగా తిట్టండి. అలా చేస్తే వాళ్ల తప్పు మనం ఎత్తి చూపినట్లు అవుతుంది. మన తప్పు ఉంటే సరిదిద్దుకుందాం. అందులో తప్పు కూడా లేదు. అలా చేయకపోతే ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ పోతుంది. మనం ప్రజా సేవకులం. పాలన అంటే సేవ అనే విషయాన్ని ప్రతి కలెక్టర్ గుర్తుపెట్టుకోవాలని జగన్ అన్నారు.