ఆంధ్రప్రదేశ్ డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం మార్చేసింది. సరిగ్గా ఎన్నికల వేళ ఏపీ పోలీస్ బాస్ గా సీనియర్ అధికారి హరీష్ కుమార్ గుప్తా నియమితులు అయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది. వెంటనే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటిదాకా ఉన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అధికార పక్షానికి సహకరిస్తున్నారని వరుస ఫిర్యాదులతో ఆయనపై ఈసీ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.
కొత్త డీజీపీ బాధ్యతలు చేపట్టగానే ఏపీలో భారీ ఎత్తున ఐపీఎస్ లు, డీఎస్పీలు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీకి రాంబంటుల్లాగా పని చేస్తున్న దాదాపు 10 మంది ఐపీఎస్లు, 20 మంది డీఎస్పీలకు కొత్త డీజీపీ ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వారికి సంబంధించిన లిస్ట్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది.
సామాన్యులు, విపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా అధికార పార్టీకి మద్దతుగా ఉండి పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఇప్పటికే వేటు వేసింది. అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాలను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అనేక మంది డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు అధికార వైఎస్ఆర్ సీపీకి అంటకాగి పనిచేస్తూ ప్రతిపక్ష పార్టీలను తీవ్రంగా వేధిస్తున్నారు. విపక్షాల ప్రచారాలకు తరచూ ఆటంకం కలిగిస్తున్నారు. వారిని అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారు. దాదాపు ప్రతి జిల్లాలోనూ ఇలాంటి అధికారులను వైసీపీ ప్రభుత్వం కోరి మరీ నియమించుకుంది.
అనంతపురం, రాయచోటి డీఎస్పీలే కాకుండా కడప డీఎస్పీ షరీఫ్ కూడా పూర్తిగా అధికార పార్టీకి ప్రయోజనం కలిగేలా పని చేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. మరోవైపు, రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ డీసీపీ కె.విజయ్ పాల్, నెల్లూరు రూరల్ డీఎస్పీ పి.వీరాంజనేయులు రెడ్డి, పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ లాంటి వారు.. స్థానిక వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలకు అండగా ఉంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాయచోటి సీఐ సుధాకర్రెడ్డి, పామిడి సీఐ రాజశేఖర్ రెడ్డి లాంటి ఇన్స్పెక్టర్లు సైతం వైసీపీ నేతల కనుసన్నల్లోనే పని చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. వీరంతా ప్రతిపక్షాలను అణచివేస్తున్నారనే ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘానికి అందాయి. కొత్త డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నియామకం అయినందున ఇప్పుడు వీరందరిపై కూడా డీజీపీ వేటు వేస్తారనే సంకేతాలు ఉన్నాయి.