కామారెడ్డి పట్టణ సిఐపై వచ్చిన ఐపీఎల్ బెట్టింగ్ ఏసీబీ కేసులో కొత్త మలుపు తిరిగింది. నేడు ఉదయం సిఐ జగదీష్ కు జిల్లా ఆస్పత్రిలో మెడికల్ పరీక్షలు నిర్వహించిన అధికారులు అనంతరం సిఐని డిఎస్పీ కార్యాలయానికి తరలించారు.
బెట్టింగ్ కేసు విషయంలో సుధాకర్ అనే వ్యక్తికి 5 లక్షలు లంచం డిమాండ్ చేసిన విషయంలో ఇప్పటికే సిఐ జగదీష్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అదే బెట్టింగ్ విషయంలో ఉన్నతాధికారుల పాత్ర ఉందేమో అనే అనుమానంతో డిఎస్పీ కార్యాలయంలో అధికారులు విచారణ చేపడుతున్నారు.
ఉదయం నుంచి డిఎస్పీ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఉంటున్న ఇంటికి అధికారులు తాళం వేశారు. విషయం తెలుసుకున్న డిఎస్పీ లక్ష్మీనారాయణ హుటాహుటిన హైదరాబాద్ నుంచి సాయంత్రం 5 గంటలకు కామారెడ్డికి చేరుకున్నారు.
దాంతో తన కార్యాలయంలోనే డిఎస్పీని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటలుగా ఏసీబీ అధికారుల విచారణ, సోదాలు కొనసాగుతున్నాయి.