తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో అలిపిరి బైపాస్,మంగళం రోడ్డు,ఎయిర్ బైపాస్,నగర నడిబొడ్డున ఉన్న ఇతర రోడ్లలో టిటిడి,నగరపాలక సంస్థ,తుడా సంయుక్తంగా ఏర్పాటుచేసిన డివైడర్ల నిర్వహణ సక్రమంగా సకాలంలో చేయకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. టిటిడి కి శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలతో,నగరపాలక సంస్థకు ప్రజలు కట్టే ఆస్తి పన్నులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తిరుపతి అభివృద్ధికి కేటాయించిన “స్మార్ట్ సిటీ” నిధులు “బూడిదలో పోసిన పన్నీరులా” మారిందన్నారు.
తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో కోట్లాది రూపాయల నిధులతో రోడ్లు విస్తరించారు డివైడర్లు ఏర్పాటు చేశారు అందులో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నాటిన ఖరీదైన మొక్కల నిర్వహణ గాలికి వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్య ఖరీదైన మొక్కలు పెట్టారు నీళ్లు పోయడం వాటి నిర్వహణ పట్టించుకోకపోవడంతో పశువులకు డివైడర్ మొక్కలు మేతగా మారిందన్నారు. తిరుపతి నగరంలోని డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన ఖరీదైన మొక్కలు గుబురుగా పెరిగిపోయి యూ “U” టర్నింగ్ ల వద్ద ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో రోడ్ యాక్సిడెంట్లు జరిగి గాయాల పాలవుతూ ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టిటిడి,నగరపాలక సంస్థ,తుడ లో అనేక సంవత్సరాలుగా చాలీచాలని జీతాలకు పనిచేస్తున్న “గార్డెనింగ్” (GARDENNING STAFF)విభాగపు సిబ్బందికి జీతాలు పెంచి, మౌలిక వసతులు కల్పించి నగరంలోని అన్నీ డివైడర్ల నిర్వహణను 24/7 వినియోగించుకోవాలన్నారు. తిరుపతిలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో కపిలతీర్థం రోడ్డుతో పాటు నగరంలోని ప్రధాన రహదారులపై మూగజీవాలైన పశువులు,గ్రామ సింహాలు నీటి కోసం,ఆహారం కోసం రోడ్లపైకి గుంపులుగా వచ్చేస్తున్నాయని పాదచారులకు,వాహనాలపై వెళ్లే వారికి అసౌకర్యంగా మారుతుందని వెంటనే నగరపాలక సంస్థ,టీటీడీ ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి గోశాలలకు తరలించి పశుగ్రాసం అందించేలా చూడాలని,అలాగే గ్రామ సింహాలకు వ్యాక్సిన్ లు వేసి డాగ్ షెల్టర్లు ఏర్పాటుచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని నగర ప్రజల తరఫున నవీన్ డిమాండ్ చేశారు.