తెలంగాణకు చెందిన’ ధృవ ‘ స్పేస్ టెక్ ప్రయివేట్ సంస్థ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించబడిన రెండు నానో శాటిలైట్స్ విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి ప్రవేశించడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో కు చెందిన పిఎస్ ఎల్ వీ -సి 54 తో పాటుగా హైద్రాబాద్ స్టార్టప్ కంపెనీ ధృవ స్టార్టప్ సంస్థ పంపిన ‘తై బోల్ట్ 1 మరియు తై బోల్ట్ 2’ అనే రెండు నానో ఉప గ్రహాల ప్రయోగం విజయవంతం కావడం దేశ ఔత్సాహిక అంకుర సంస్థల చరిత్రలో సుదినంగా మంత్రి పేర్కొన్నారు. ప్రయివేటు రంగం ద్వారా ఉప గ్రహ ప్రయోగాల చరిత్రలో మరో గొప్ప విజయం అని మంత్రి తెలిపారు. టిహబ్ సభ్య సంస్థ అయిన, స్కైరూట్ స్టార్టప్ కంపెనీ ఇటీవలే ప్రయోగించిన విక్రమ్ –ఎస్ శాటిలైట్ విజయవంతం కావడం ద్వారా దేశ ఉప గ్రహ ప్రయోగాల చరిత్రలో తెలంగాణ స్టార్టప్ కంపెనీ మొట్ట మొదటి సంస్థగా చరిత్రను లిఖించిందని అన్నారు. ఔత్సాహికుల ప్రతిభను వెలికితేయడం, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో అవకాశాల సృష్టే లక్ష్యంగా ప్రారంభించిన టి హబ్ లు భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్ళు సాధిస్తాయని ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. టి హబ్ ప్రోత్సాహంతో, తమ స్టార్టప్ సంస్థల ద్వారా ఉప గ్రహాలను రూపొందించి వాటిని విజయవంతంగా ప్రయోగించి తెలంగాణ కీర్తిని చాటిన స్కైరూట్ మరియు ధృవ స్పేస్ స్టాటప్ సంస్థల ప్రతినిధులకు మంత్రి శుభాకాంక్షలను తెలిపి అభినందించారు.
previous post