ఉత్తర ప్రదేశ్ లో నిర్వహిస్తున్న మదర్సాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉత్తరప్రదేశ్ లోని మదర్సాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ చదువుతున్న వారికి కేంద్రం ఇక నుంచి స్కాలర్ షిప్ లు ఇవ్వదు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలు కల్పిస్తున్నందున విద్యాహక్కు చట్టం పేరుతో మదర్సాలలో చదివే వారికి ఇకపై ఉపకార వేతనం ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది.
అయితే 9, 10 తరగతులు చదివే వారికి మాత్రం ఈ నిబంధన వర్తించదు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ మదర్సాలలో చదివే వారికి నెలకు వెయ్యి రూపాయల ఉపకారవేతనం ఇచ్చే వారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ వారు చదివే విద్యను బట్టి స్కాలర్ షిప్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సౌకర్యాన్ని నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో నిర్వహిస్తున్న మదర్సాలపై సర్వే చేయించింది.
రాష్ట్రంలోని 558 మదర్సాలలో ని ఐదు లక్షల మంది విద్యార్ధులకు కేంద్రం ఇచ్చే స్కాలర్ షిప్ అందేది. కొద్ది కాలం కిందట బరబంకి అనే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్ధులు 35 కిలోమీటర్ల దూరంలో తాము చదివే మదర్సా నుంచి పారిపోయి వచ్చారు. మదర్సాల్లోని వారు తమను అది దారుణంగా హింసిస్తున్నారని తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. అయితే తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విషయం తెలుసుకున్న ఉత్తర ప్రదేశ్ బాలల హక్కుల సంఘం ఈ కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది.
సంబంధిత మదర్సాలోనే కాకుండా చాలా చోట్ల అర్హత కలిగిన టీచర్లు లేరని, శిక్షణ పొందిన వారు అసలే లేరని తన నివేదికలో పేర్కొన్నది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మదర్సాలపై సర్వే చేయించింది. ఈ సర్వేను అనేక ముస్లిం సంఘాలు, సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే మదర్సాలను మరింత మెరుగు పరిచేందుకు ఈ సర్వే ఉపకరిస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత మదర్సాలపై జరిగిన సర్వే రిపోర్టు పై చర్యలు తీసుకున్నారు. అర్హతగల టీచర్లు లేకపోవడం వల్ల మదర్సాలలో విద్యాబోధన సక్రమంగా జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. బహుశ ఈ సర్వే ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు.