విమానంలో మహిళా ప్రయాణీకురాలిపై మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన ఒకడి కథ మరువక ముందే ఈసారి విమానంలో మరో సంఘటన జరిగింది. ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి పాట్నాకు వస్తున్న ముగ్గురు యువకులు కలకలం సృష్టించారు. ఎయిర్ హోస్టెస్ జోక్యం చేసుకోవడానికి వెళ్లగా వారు ఆమెతో కూడా అసభ్యంగా ప్రవర్తించారు. కెప్టెన్ జోక్యం చేసుకోవడంతో, అతనిపై కూడా దాడి చేశారు. ఇండిగో ఫ్లైట్ 6E-6383లో ఈ ఘటన జరిగింది.
ఈ పోకిరీ లను రోహిత్ కుమార్, నితిన్ కుమార్, పింటూ కుమార్ లు గా గుర్తించారు. వీరంతా ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకులుగా చెప్పుకుంటూ పాట్నా విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)ను కూడా బెదిరించారు. విమానాశ్రయం సిబ్బంది అతి కష్టంపై వీరిని పట్టుకుని బీహార్ పోలీసులకు అప్పగించారు. బీహార్లో సంపూర్ణ నిషేధం అమలులోకి వచ్చినందున, ఇతర రాష్ట్రాల విమానాశ్రయాలు మరియు రైల్వే స్టేషన్లలో బీహార్కు వెళ్లే ప్రయాణికులు తాగిన స్థితిలో ఇలా ప్రవర్తిస్తున్నారు. బీహార్ లో తాగడమే కాదు.
మత్తుతో పట్టుబడితే కూడా జైలు శిక్ష తప్పదని అక్కడి పోలీసులు హెచ్చరిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు బీహారీలు. తమను తాము ఒక రాజకీయ నాయకుడితో సన్నిహితంగా ఉన్నామని చెప్పుకోవడంతో బాటు తామే రాజకీయ నాయకులమని కూడా చెప్పుకున్నారు.