యువత కన్నవారి ఆశయాలకు అనుగుణంగా, తమ లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని విజయనగరం నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు.ఈ మేరకు నగరంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో శ్రీ చైతన్య డిగ్రీ, పి జీ కళాశాల 22 వ వార్షికోత్సవ వేడుకలు లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
గత 22 ఏళ్లుగా కాలేజీ యాజమాన్యం యువతను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతోందన్నారు. యువత లక్ష్యాలను సాధించే దిశగా కాలేజీ యాజమాన్యం చేసిన కృషి ఎంతైనా అభినందనీయమన్నారు. ప్రస్తుత పరిస్థితులలో యువత వాళ్లు ఎన్నుకున్న రంగాలలో రాణించే విధంగా శ్రమించాలన్నారు.
ప్రతి రంగంలో కూడా పోటీతత్వం ఉంటుందని, ఇందుకు తగ్గట్టుగా యువత నైపుణ్యాభివృద్ధి, చర్చావేదికలు లో పాల్గొనే విధంగా చూడాలన్నారు. ఈ సందర్భంగా కళాశాల లో చదివి ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్ తో పాటు, అభినందన పత్రాలను ముఖ్య అతిధి, నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చేతులమీదుగా అందజేశారు.
విద్యార్థిని, విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అల్లూరి నారాయణ మూర్తి రాజు, కళాశాల కరస్పాండెంట్ అల్లూరి కిరణ్ కుమార్ రాజు, కళాశాల ప్రిన్సిపాల్ పి. బి.బి. ఎల్.ఎన్. రాజు, కళాశాల అధ్యాపక సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.