కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయను కోరారు. న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్ లో ఉన్న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం మంత్రి విడదల రజిని కేంద్ర మంత్రి డాక్టర్ మాండవీయను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ గతంలో 13 జిల్లాలుగా ఉన్న తమ రాష్ట్రం ఇప్పుడు 26 జిల్లాలుగా రూపాంతరం చెందిందని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. ఆయన చేస్తున్న గొప్ప పరిపాలనకు కేంద్రం చొరవ కూడా తోడైతే తాము మరింతగా అద్భుతాలు చేసి చూపిస్తామని తెలిపారు. పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల లో మెడికల్ కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులొచ్చాయని, ఇప్పుడు ఈ మూడు చోట్ల కళాశాలల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి రజిని వివరించారు. ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారని చెప్పారు.
ఇప్పటికే అన్ని చోట్లా మెడికల్ కళాశాలల నిర్మాణం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 17 మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని, తగిన ఆర్థిక సాయాన్ని అందజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఏపీ వైద్య ఆరోగ్య రంగంలో కీలకమైన మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. అలాగే వైఎస్సార్ హెల్త్ క్లినిక్ల గురించి కేంద్రమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎప్పుడూ, ఎక్కడా కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 46 వేలకు పైగా నియామకాలను ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే చేపట్టారని వెల్లడించారు. 16 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తున్నారని వివరించారు. గ్రామగ్రామానికి హెల్త్ క్లినిక్లు ఏర్పాటుచేశామని తెలిపారు.
కేంద్రం సహకారం కూడా తోడైతే జగనన్న మరిన్ని అద్భుతాలు చేసి చూపిస్తారని చెప్పారు. రాష్ట్ర మంత్రి విడదల రజిని విజ్ఞప్తులకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ సానుకూలంగా స్పందించారు. ఏపీలో వైద్య ఆరోగ్య రంగంలో తీసుకొస్తున్న మార్పులు తమ దృష్టిలో కూడా ఉన్నాయని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సహకారం కూడా అందజేస్తామన్నారు. ఏపీలో వైద్య కళాశాలల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. అనంతరం ఏపీ ప్రభుత్వం తరఫున విజ్ఞాపనా పత్రాన్ని మంత్రి విడదల రజిని కేంద్రమంత్రికి అందజేశారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.