తమ అభిమాన హీరో తల్లిని కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. పద్మాలయ స్టూడియో నుంచి మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో ఘట్టమనేని కుటుంబసభ్యులతో పాటు.. సినీ ప్రముఖులు..అభిమానులు పాల్గొన్నారు. ఇందిరాదేవి మృతితో ఘట్టమనేని కుటుంబంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి.
తల్లి పార్థివదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి బుధవారం తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఇందిరాదేవి సూపర్ స్టార్ క్రిష్ణకు మొదటి భార్య. వీరికి ఐదుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు పద్మ, మంజుల, ఇందిర ప్రియదర్శిని.. అబ్బాయిలు రమేష్ బాబు, మహేష్ బాబు. ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు.
చిత్రపరిశ్రమలో ఇద్దరు అబ్బాయిలు సినిమాలతో బిజీ అయినా.. ఏ రోజూ సినీ వేడుకలకు హాజరు కావడానికి ఆసక్తి చూపించలేదు ఇందిరా దేవి. ఈ ఏడాదిలోనే మహేష్ ఇంట రెండు విషాదాలు నెలకొన్నాయి. ఇటీవల అనారోగ్యంతో మహేష్ అన్న రమేష్ బాబు మృతి చెందగా.. ఇప్పుడు తల్లి ఇందిరా దేవి దూరం కావడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.