భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణారావు అధ్యక్షతన ఆదివారం ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో ని అణుపురం కమ్యూనిటీ హాల్ లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, డి.జి. నర్సింగరావు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఏప్రిల్ నెలలో జరిగిన అఖిలభారత మహాసభలలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి, జిల్లాకి అన్వయించుకుని భవిష్యత్తులో ఏ విధంగా పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్లి బలోపేతం చేయాలని నిర్ణయించుకుని ముందుకు వెళ్లాలని ఈ సమావేశం నిర్ణయించింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్ప చెబుతూ లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని దివాలా తీసుకున్నారని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో మతకలహాలు రెచ్చగొట్టే విధంగా, ప్రజలను చీల్చే విధంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఇది తగదని అన్నారు.
ఇంకోపక్క పెట్రోల్ చార్జీలపై కేంద్రం సేస్ కింద రకాల పనులతో రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కూడా కేసీఆర్ వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమయ్యారని, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో గానీ, కళ్యాణ లక్ష్మి ప్రస్తుతం అమలు కావడం లేదన్నారు. రాష్ట్రం కూడా మూడు లక్షల కోట్ల అప్పులు చేసిందని దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉందన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన 57 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ బకాయిలతో సహా చెల్లించాలని, రాజీవ్ గృహకల్ప కాలనీ ఇండ్ల రుణాలను రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రధాన సమస్యల పైన వామపక్షాల ఆధ్వర్యంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య కార్యాచరణ కూటమి ఆధ్వర్యంలో సమస్యల పైన కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
కురునెలి సలోమీ కి సన్మానం
కరాటే అంతర్జాతీయ పోటీలలో నేపాల్ లో జరిగిన అండర్ 14 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన కురునెల్లి సలోమిని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శాలువా కప్పి సన్మానించారు. ఎస్ వీరయ్య బొకే ను అందించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆమె మరిన్ని పోటీలలో పాల్గొనడానికి ఇబ్బందికరంగా ఉందని తెలియజేయగా అప్పటికప్పుడే 50 వేల రూపాయలు అందజేస్తామని కేరళ కామ్రేడ్ ముందుకు రావడం జరిగింది.
రాష్ట్ర జిల్లా పార్టీలు కూడా సలోమికి సహకరిస్తామని ఆమె మరిన్ని పతకాలు సాధించి ఈ దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కొనియాడారు. ఈ సమావేశాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి పి.సత్యం, కార్యవర్గ సభ్యులు కోమటి రవి, చింతల యాదయ్య, అశోక్, వినోద తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి