తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిలో కీలకమైన గ్రామసభల నిర్వహణ విషయంలో కొన్ని గ్రామాల సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు అలసత్వం వహిస్తున్నారు.
గ్రామాభివృద్ధిలో అత్యంత కీలకమైన గ్రామసభ ఏర్పాటును కరోనాను సాకుగా చూపి వాయిదాలు వేస్తూ వస్తున్నారు. దీనివల్ల పల్లెప్రగతిలోని 29 అంశాల పురోగతి విషయంలో అటు పాలకవర్గం, ఇటు ప్రజల భాగస్వామ్యం ప్రశ్నగానే మిగిలిపోతుంది. ప్రతి రెండు నెలలకొకసారి గ్రామసభలను ఆ గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించాలి.
కానీ, చాలా వరకు పంచాయతీల్లో సభల నిర్వహణ జరగడం లేదు. ఇటీవల నిర్వహించిన పల్లె ప్రగతి సమీక్షలో సీఎం కేసీఆర్ గ్రామసభల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధిగా గ్రామ సభలు జరపని గ్రామ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీ లపై వేటు తప్పదన్నారు.
ఈ నేపథ్యంలోనే పలు గ్రామ పంచాయతీలు సభలు పెట్టనప్పటికీ, ఆయా తేదీల్లో సభలు పెట్టినట్లుగా హడావుడిగా పంచాయతీ రికార్డుల్లో నమోదు చేస్తుండటం కొసమెరుపు.
గ్రామ సభలు అనేవి గ్రామ అభివృద్ధికి, గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని అందరికీ తెలిసేలా చేస్తూ కొత్త పనులకు శ్రీకారం చుట్టే వేదికలు. అందువల్ల గ్రామ సభల నిర్వహణ పై ప్రభుత్వం పట్టించుకోవాలి.
గోళ్ళ నరేందర్, ఏం.ఎస్.సి(జీవరసాయన శాస్త్రం)కాకతీయ యూనివర్సిటీ