హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలియజేశారు. గుజరాత్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని ఓ ట్వీట్లో అన్నారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ, హిమచల్లో కీలకమైన విజయాన్ని అందించిన ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. అంకిత భావంతో కార్యకర్తలు,నాయకులు కృషి చేశారని,ప్రజలకు పార్టీ చేసిన వాగ్దానాలను సాధ్యమైనంత త్వరలో నెరవేరుస్తామని చెప్పారు. గుజరాత్ ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసావహిస్తామని రాహుల్ చెప్పారు.పార్టీని పునర్వవస్థీకరించేందుకు కష్టపడతామని అన్నారు. దేశ ప్రజల ఆదర్శాలు, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని మరో ట్వీట్లో రాహుల్ తెలిపారు. గుజరాత్ ఎన్నికల్లో కేవలం 17 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ,హిమాచల్ ప్రదేశ్లో 40 స్థానాలతో మెజారిటీ మార్కను దాటి ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంది. బీజేపీ నుంచి ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశాలున్నాయని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ గెలిచిన తమ ఎమ్మెల్యేలతో ఛండీగఢ్లో సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే సీఎల్పీ నేతను ఎన్నుకుని, సీఎం పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.