జనసేన అధినేత పవన్ కల్యాణ్పై పోటీ చేయడానికి తాను సిద్ధమని సినీ నటుడు , ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ వ్యాఖ్యానించడం ముఖ్యమంత్రి జగన్ మాటగానే భావించాల్సిన పరిస్థితి ఉంది. జగన్ అనుమతి లేకుండా, ముందే అనుమతి లేకుండా అలీ ఇంతటి కీలక ప్రకటన చేసే వీలే లేదని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం వైసీపీలో కోస్తా జిల్లాలలో ముస్లిం అభ్యర్ధి ఒక్కరు కూడా లేరు. ఆ ప్రాంతంలో ముస్లింలను ఈ సారి ఎన్నికలలో అనువుగా మలచుకోవడానికి ముస్లిం అభ్యర్ధిని ఒక్కరి నైనా కోస్తా ప్రాంతంలో పోటీకి దించాలని వైసీపీ ఎత్తుగడ వేస్తున్నది. ఈ నేపథ్యంలోనే అలీకి పదవి ఇచ్చి పక్కన పెట్టుకున్నారని అంటున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఎన్నికలలో భీమవరం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. అదే విధంగా గాజువాక అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి నాగిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ సారి కూడా పవన్ కల్యాణ్ ఆ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా లేక ఆ రెంటిలో ఒకదాని నుంచి పోటీ చేస్తారా అనేది స్పష్టం కాలేదు.
గాజువాక, భీమవరం కాకుండా మరేదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అనేది కూడా వెల్లడి కాలేదు. పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. అయితే తిరుపతి నుంచి పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ ఆసక్తిగా లేరు. అందువల్ల భీమవరం లేదా గాజువాకలో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తున్నది.
సినీ నటుడు అలీ రాజమండ్రిలో పుట్టి పెరిగారు. ఆయనకు సొంత నియోజకవర్గం అంటూ లేదు. అందువల్ల భీమవరం నుంచి అయినా లేదా గాజువాక నుంచి అయినా సరే అలీని పోటీకి సిద్ధం చేస్తున్నారు. అలీని అసెంబ్లీకి పోటీకి దించడం ద్వారా ముస్లిం అభ్యర్ధికి కోస్తా జిల్లాల నుంచి ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుంది. కోస్తా జిల్లాల్లో ముస్లింల సంఖ్య గణనీయంగానే ఉంది. ఇటీవలి కాలంలో ముస్లింలు వైసీపీ నుంచి దూరం జరిగినట్లు భావిస్తున్నారు.
అందువల్ల వారిని దగ్గరకు తీసుకోవడానికి వీలుగా ఎన్నికల ముందు మరి కొన్ని కొత్త పథకాలు ప్రవేశ పెట్టడంతో బాటు అలీని ఎన్నికల బరిలో దించేందుకు వైసీపీ సమాయత్తం అవుతున్నది. ఇప్పటికే పవన్ కల్యణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచి పోటీ చేయాల్సిందిగా వైసీపీ అలీని సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన పవన్ కల్యాణ్ పై పోటీ చేస్తానని ప్రకటించారు.
సీఎం ఆదేశిస్తే ఎవరిపైనైనా పోటీ చేస్తానని అలీ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారో ప్రజలకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. విమర్శలు ప్రతి విమర్శలు చేయటం సాధారణమని.. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని అలీ అన్నారు. చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో భాగంగా మంగళవారం అలీ ఈ వ్యాఖ్యలు చేశారు. అలీపై పవన్ కల్యాణ్ గెలిస్తే ఫర్వాలేదు కానీ ఓడిపోతే పవన్ కల్యాణ్ కు సినీ పరిశ్రమలో కూడా చిన్న చూపు చూస్తారు. ఈ విధంగా పవన్ కల్యాణ్ పై తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని జగన్ ఎత్తుగడ వేశారని అంటున్నారు.