బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణలో 1,91,607 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉందని అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ.అజీజ్ మాట్లాడారు.
7 సంవత్సరాలుగా కెసిఆర్ పాలనలో నిరుద్యోగలకు అన్యాయమే జరుగుతున్నదని ఆయన అన్నారు. బిస్వాల్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలోని పది పాత జిల్లాలలో ప్రాతిపదికన ఉండవలసిన ఉద్యోగాల సంఖ్య నివేదిక రూపంలో అందించారని, పాత జిల్లాలలో ఉండవలసిన మొత్తం ఉద్యోగాల సంఖ్య 4,91,304గా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సుమారు నలభై శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన వివరించారు.
ఇన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉండటం వలన ప్రస్తుతం సర్వీసులో ఉన్న వారికి పనిభారం, మానసిక వేదన రెట్టింపు అయిందని తెలిపారు. గడిచిన ఏడు సంవత్సరాల పాలనలో ఒక్క డిఎస్సి కూడా లేదని,నిరుద్యోగులు ఉద్యోగాల కోసం టి ఎస్ పి ఎస్ సి లో సుమారు 30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన అన్నారు. కొత్త జిల్లాలు,క్రొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు,క్రొత్త మున్సిపాలిటీలు,పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినా కానీ ప్రజలకు సుపరిపాలన మాత్రం దొరకడం లేదని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో కొత్త జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సుమారు 100 మంది ఉద్యోగస్తులు ఉండాలి కానీ 40.50 శాతం మంది మాత్రమే ఉద్యోగస్తులు ఉన్నారని, ముఖ్యమంత్రి కెసిఆర్ దుబ్బాక ఉప ఎన్నికల దగ్గర్నుండి హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకు ఇలాంటి మాటలే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను,నిరుద్యోగ యువతను,విద్యార్థులను మోసం చేస్తున్నారని అజీజ్ పాషా విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముశం సత్యనారాయణ, జక్కుల మల్లయ్య,ఎస్.కె. బిక్కన్ సాహెబ్, పాశం రామరాజు,మేళ్లచెరువు ముక్కంటి, కుక్కడపు మహేష్ గౌడ్,దొంతగాని జగన్,ఎస్.కె.అజ్జూ తదితర నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్