జార్ఖండ్ రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలైందని జార్ఖండ్ ముక్తి మోర్చా వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ తెలిపారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఆధికారం చేపట్టడం ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. తనపై విశ్వాసం ఉంచిన లాలూప్రసాద్ యాదవ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు హేమంత్ థ్యాంక్స్ చెప్పారు.
తీర్పు ఇచ్చిన ప్రజలకు కూడా హేమంత్ థ్యాంక్స్ తెలిపారు. మొత్తం 81 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ 25 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటకు కావాల్సిన మెజారిటీ (41) స్థానాలకు మించి కూటమి 47 సీట్లు సాధించింది. జేఎంఎం 30 స్థానాలలో, కాంగ్రెస్ 16 స్థానాలలో ఆర్జేడి ఒక స్థానంలో గెలుపొందాయి. జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం అభ్యర్థి హేమంత్ సోరెన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం సాధించారు.
జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత మూడు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో రెండు రాష్ట్రాలలో బిజెపి గెలవలేకపోయింది. గత ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛతీస్ గఢ్ రాష్ట్రాలను కోల్పోగా ఆ తర్వాత మహారాష్ట్ర బిజెపి చేజారి పోయింది. తాజాగా జార్ఖండ్ రాష్ట్రం బిజెపి చేతి నుంచి వెళ్లిపోయింది.