బిసీలపై దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవని, బిసి పొలిటికల్ జెఏసి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హెచ్చరించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో దాడికి గురైన సర్పంచ్ వెంకటస్వామి సాగర్ ను పరామర్శించి ఆయనతో కలిసి దాడి జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ పెద్దమందడి మండలంలో రౌడీ బ్రదర్స్ అక్రమాలు, అరాచకాలు ఎక్కువయ్యాయని, పేదల భూములు కబ్జా చేయడమే కాకుండా రాత్రిపూట అక్రమ ఇసుక వ్యాపారం నిర్వహిస్తూ అనేక మంది చావుకు కూడా కారణమయ్యారని ఆరోపించారు.
సర్పంచ్ కు పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ మూడేళ్ల కింద సర్పంచ్ సర్వేకు దరఖాస్తు పెట్టుకున్నా కూడా సర్వేయర్ ని రాకుండా అడ్డుకున్నాడని, చివరికి తహసీల్దార్ ఆదేశాలతో నిన్న సర్వేయర్ వస్తున్నాడన్న సమాచారం తెలుసుకుని, ఎలాగైనా సర్వేను అడ్డుకోవాలన్న ఉద్దేశ్యంతో సర్పంచ్, అతని కుటుంబ సభ్యులపై వారు దాడి చేశారని అన్నారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగిందని, గ్రామ ప్రథమ పౌరునికే ఈవిధంగా జరిగితే సామాన్య ప్రజల సంగతేంటని ప్రశ్నించారు.
సర్పంచ్ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించడమే గాక, సర్పంచిపై, అతని కుటుంబ సభ్యులపై దాడి చేసిన వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. మళ్ళీ ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడితే ఉపేక్షించబోమని, తిరగబడి తరిమికొట్టేందుకు కూడా బీసీలు వెనకాడరన్న సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మనిగిళ్ల శివ యాదవ్, నరేష్,వివేకానంద, యాదన్న, రమేష్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్