విజయనగరం జిల్లాలో పరిశ్రలమ స్థాపనకు అన్నివిధాలా సంపూర్ణంగా సహకారం అందిస్తామని కలెక్టర్ ఎ.సూర్యకుమారి అన్నారు. విద్యార్థులు, యువకులు పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇలా ముందుకు వచ్చేవారిని కలిసేందుకు ప్రతీనెలా మూడో శనివారం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తామని కలెక్టర్ ప్రకటించారు.
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు, వాణిజ్యం, ఎగుమతులను పెంచేందుకు గానూ, జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ హోమ్లో వాణిజ్య ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవారికి సింగిల్ విండో విధానంలో అన్ని రకాల అనుమతులను త్వరితగతిన మంజూరు చేస్తామన్నారు.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఎన్నో అవకాశాలు
జిల్లాలో వ్యవసాయాధారిత పరిశ్రమల స్థాపనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మరో రెండుమూడేళ్లలో రాయపూర్-విశాఖపట్నం జాతీయ రహదారి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే, ఎగుమతులు చేసేందుకు విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాలో పర్యటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పొరుగు రాష్ట్రం ఒడిషా, విశాఖ జిల్లాలోని అరకు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని, వాటితో జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ, ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించాలని సూచించారు.ప్రస్తుతం చిన్నవయసులోనే ప్రపంచ వ్యాప్తంగా యువ పారిశ్రామికవేత్తలు అద్భుతాలు చేస్తున్నారని చెప్పారు.
విద్యార్థులు, యువత కేవలం వైట్కాలర్ జాబ్స్ కోసమే ఎదురుచూడకుండా, స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రతీనెలా మూడో శనివారం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తామని, సరికొత్త ఆలోచనలు, వినూత్న ప్రతిపాదనలతో ముందుకు రావాలని సూచించారు.
మూతపడ్డ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ) ఉత్పత్తి చేసిన వస్తువులను, వివిధ శాఖల అవసరాలకు కొనుగోలు చేయడం ద్వారా వాటిని ప్రోత్సహిస్తామని చెప్పారు. జిల్లాలో మూతబడ్డ పరిశ్రమలపైనా దృష్టి పెడతామన్నారు. విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కూడా జిల్లాలో అవకాశం ఉందన్నారు.
సోలార్ పేనల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. టూరిజం, వస్త్ర పరిశ్రమ, ఆక్వా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు మరింత ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ ప్రకటించారు.
జిల్లాలోని వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డీజీఎఫ్టీ ఆర్.రోజారాణి, పాప్సి డైరెక్టర్ దేవ్, ఏపీఛాంబర్ డైరెక్టర్ జి.శివకుమార్, ఎల్డిఎం శ్రీనివాసరావు, పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ జిఎం శ్రీధర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.