ఆదాయం కోసం మద్యం దుకాణాలు తెరిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయం కోసం మరో శాఖను కూడా రంగంలో దించుతున్నది. లాక్ డౌన్ కారణంగా ఏపీలో మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సడలింపుల్లో భాగంగా రేపటి నుంచి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా భారీగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం, రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వడం ద్వారా తిరిగి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. వీటి ప్రకారం ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు కూడా మాస్క్ లు ధరించాలని సూచించింది. ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తూ కార్యకలాపాలు సాగాలని ఆదేశించింది.
రిజిస్ట్రేషన్ కోసం ముందుగా వచ్చే వారికి ముందుగా అనుమతి ఇవ్వాలని రిజిస్ట్రార్లకు సూచించింది. అలాగే ఉద్యోగుల హాజరు కోసం వాడే బయోమెట్రిక్ యంత్రాలను రోజూ శానిటైజ్ చేయాలని కోరింది. పది మంది కంటే ఎక్కువగా గుమికూడకుండా ఉంచాలని, ఆఫీసులను రోజూ డిస్ ఇన్ ఫెక్షన్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. ఇతరులు ఎవరినీ కార్యాలయాలకు అనుమతించరాదని ఆదేశించింది.