కిలో రూ.150కు పైగా టమాటా ధర పలుకుతున్న నేపథ్యంలో కర్ణాటకలోని హసన్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో రూ.1.5 లక్షల విలువైన టమాటాలను దొంగిలించి పరారైనట్లు పోలీసులు తెలిపారు. గోని సోమనహళ్లి గ్రామానికి చెందిన ధరణి అనే రైతు తన టమాట పంట కనిపించకుండా పోయిందని హళేబీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు స్థానిక రైతులను ప్రశ్నించగా దాదాపు 50 నుంచి 60 బస్తాలతో పొలంలోకి ప్రవేశించిన దొంగలు, వాటిల్లో 1.5 లక్షల విలువైన టమాటాలను నింపి పరారైనట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశారు.
తాజా సమాచారం ప్రకారం, బెంగళూరులో ప్రస్తుతం టమాటా ధర కిలో రూ.100 నుంచి 120 మధ్య ఉంది. ఈ ఏడాది కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడం, ఎరువుల ధరలు అధికంగా ఉండడంతో ఎవరూ టమాటాను సాగు చేయలేదు. దీంతో అక్కడ టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.