ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై లోకల్ సర్కిల్స్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. దేశంలోని 280 జిల్లాలలో చేసిన సర్వే ప్రకారం మోదీ ప్రభుత్వం పనితీరుపై 62 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.
అవినీతి తగ్గుదలకు అనుకూలంగా 49 శాతం, వ్యతిరేకంగా 43శాతం స్పందించారు. విదేశాంగ విధానం అమలుతో భారతదేశం ఇమేజ్ పెరిగిందని 79 % మంది అభిప్రాయపడగా , నిరుద్యోగం కట్టడి కి అనుకూలంగా 56% ప్రజలు ఆమోదించారు.
ధరల నియంత్రణ అంశానికి 36% అనుకూలంగా ఉంటే, 56% వ్యతిరేకత వ్యక్తం చేశారు. మత పరమైన అంశాలు, ఉగ్రవాదం అణచివేత వంటి వాటిపై అధికశాతం ప్రజలు మోదీ ప్రభుత్వం పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ని రకాల ఒత్తిడులు తట్టుకొని మెజారిటీ ప్రజల నైతిక మద్దతుతో పరిపాలన సాగుతుండగా కరోనా ఆకస్మిక విజృంభణ భారత దేశాన్ని ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది.
మోదీ చర్యలతో కరోనా నుంచి పూర్తి రక్షణ
130 కోట్ల పైచిలుకు దేశ ప్రజలకు పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వడానికి కేంద్రప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయాలు కరోనా దాడి నుంచి ప్రజలు సురక్షితంగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం మోదీ తీసుకున్న కరోనా కట్టడి చర్యలను 82 శాతం ప్రజలు ప్రశంసించారు.
ప్రపంచదేశాలలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడుగా నరేంద్రమోదీ గుర్తింపు పొందడం విశేషం. సీ ఓటర్ – ఐ ఏ ఎన్ ఎస్ సర్వే విశేషాలు పరిశీలిస్తే సమీప భవిష్యత్తులో భారతదేశ రాజకీయ పరిణామాలుఎలా ఉండగలవో ఊహించవచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
నవీన్ ది బెస్ట్ సిఎం
ప్రధాని మోదీ పనితీరు పట్ల అత్యంత సంతృప్తి ప్రకటించిన రాష్టాలలో ఒడిశా 95.6 శాతం తో మొదటిస్థానం లో ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు ప్రధమ స్థానం దక్కడం విమర్శకుల దృష్టిని ఆకర్షించింది.
ఉత్తరాదిరాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ,కర్నాటక రాష్ట్రాలలో ప్రధాని పనితీరు పై సంతృప్తి శాతం అధికంగా ఉన్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. దేశం మొత్తంమీద దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో మాత్రమే అతితక్కువ శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు దిక్సూచి
కేంద్రప్రభుత్వం పనితీరు పై అత్యంత తక్కువ సంతృప్తి ప్రకటించిన రాష్ట్రాలలో గోవా, హర్యానా, కేరళ, తమిళనాడు, జమ్మూకాశ్మీర్ ఉన్నాయి. సమీప భవిష్యత్తులో జరుగనున్న కొన్ని రాష్ట్రాలశాసన సభ ఎన్నికల ఫలితాలను నిర్ణయించడానికి ఈ తరహా సర్వేలు రాజకీయ పార్టీలకు ముందస్తు హెచ్చరికగా ఉపకరిస్తాయి.
బీహార్ (2020), పాండిచ్చేరి (2020) , అస్సాం (2021), జమ్మూ,కాశ్మీర్ (2021), కేరళ (2021), తమిళనాడు (2021) పశ్చిమ బెంగాల్(2021) రాష్టాలకు జరుగనున్న శాసన సభల ఎన్నికల సమయానికి రాజకీయ పార్టీల బలాబలాలు, పొత్తులు, సమీకరణలు వంటి కీలక అంశాలను సర్వే ఫలితాలు ప్రభావితం చేయగలవు.
అసలు ఎన్నికలు జరుగుతాయా?
ప్రస్తుతం కరోనా సంక్షోభం శిరోభారంగా పరిణామించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకమే. అయినా… పరిస్థితులు చక్కబడితే షెడ్యూల్ ప్రకారం రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. బీజేపీ బలం తక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఆపార్టీ పుంజుకోవడానికి చేపట్టగల కార్యాచరణ పై ఆధారపడి పార్టీకి విజయావకాశాలు దక్కుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
కృష్ణారావు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి