పట్టణాలలోని యువత మన కోసం, మన పట్టణ ప్రగతి కోసం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పిలుపునిచ్చారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 15, 16, 17 వార్డులలో పట్టణ ప్రగతిలో భాగంగా మొక్కలు నాటి, మన కోసం మనం గోడ స్టిక్కర్లని అతికించి, వీధి వీధి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమం అనంతరం స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ప్రగతి ప్రతి వార్డులో పారిశుద్ధ్య లోపం లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని వార్డు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
అధికారులతో పాటు ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా భావించి వార్డులను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, పట్టణ ప్రగతిలో అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని అన్నారు. వార్డులో మొక్కల్ని పరిరక్షించుకోవడం లో సిబ్బందితో పాటు ప్రజలు కూడా మమేకం కావాలని, ప్రతి ఆదివారం రోజు పది గంటలకు ప్రతి ఒక్కరూ పదినిమిషాల పాటు ఇంటి పరిసరాల్లో ఉన్న వ్యర్ధ నీటిని శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
వ్యర్థ నీరు నిల్వ ఉండటం వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి ప్రమాదకర విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. 15, 16, 17 వార్డుల్లో వీధి వీధి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు తమ దృష్టికి రాగానే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపడంతో పాటు ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మున్సిపాల్ చైర్మన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,ఆయా వార్డుల కౌన్సిలర్లు, మునిసిపాలిటీ అధికార సిబ్బంది పాల్గొన్నారు.