తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోనే ధర్మకర్తల మండల సమావేశాన్ని నిర్వహించేవిధంగా చర్యలు తీసుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి కోరారు. కీలకమైన విజిలెన్స్,సివిల్ ఇంజనీరింగ్, ఫైనాన్స్, ఎలక్ట్రికల్ ఇతర విభాగాధిపతుల కార్యాలయాలు కూడా అక్కడే ఉన్నందున సమావేశ నిర్వహణ సౌకర్యంగా ఉంటుందని ఆయన సూచించారు.
టిటిడి ధర్మకర్తల మండలి సమావేశాలు తిరుమల అన్నమయ్య భవన్ లో నిర్వహిస్తున్నందున బోర్డు సభ్యులు మంది మార్బలంతో, బంధుమిత్రులతో తిరుమల కొండపై ఉన్న పద్మావతి ఏరియాలోని కాటేజీలను రిజర్వు చేసుకోవడంతో అనేకమంది భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. తిరుమలలో ధర్మకర్తల మండలి సమావేశాల సందర్భంగా టిటిడి పరిపాలన భవనంలోని ఉన్నతాధికారులు వారి సిబ్బంది అనేక వాహనాలలో తిరుమలకు వెళ్లే అవసరం లేకుండా పోతుందని, తద్వారా శ్రీవారి సొమ్ము దుబారా ఖర్చులు తగ్గుతుందని ఆయన అన్నారు.
టిటీడీ ధర్మకర్తల మండలి సమావేశాన్ని తిరుపతికి మారిస్తే తిరుమల కొండపై ఉన్న కాటేజీల కేటాయింపు అధికారులపై ఒత్తిడి తగ్గి పద్మావతి ఏరియాలో భక్తులందరికీ కోరిన విధంగా గదులు దొరికే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.