రాబోయే ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనల ప్రకారం మీడియా పోషించే పాత్రను పర్యవేక్షించాలని రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని బీ.ఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ ఎన్నికలలో మీడియా పాత్ర పర్యవేక్షణ పై రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న జిల్లా పౌర సంబంధాల అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మీడియా పోషించే పాత్రను పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు . ఎన్నికల సమయంలో వార్తాపత్రికలలో సామాజిక మాధ్యమాలలో వచ్చే పెయిడ్ న్యూస్ గుర్తించే ప్రక్రియ పై ఆయన అధికారులకు అవగాహన కల్పించారు.
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారంలో వినియోగించే ఆడియో, వీడియోలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనల గురించి వివరించారు.కేంద్ర భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నుంచి వార్తాపత్రికల్లో అభ్యర్థులకు వచ్చే ప్రకటనలను ప్రతిరోజు సేకరించాలని, అభ్యర్థులకు అనుకూలంగా వచ్చే వార్తల గుర్తింపు, పెయిడ్ న్యూస్ నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సమావేశంలో మాస్టర్ ట్రైనర్లు అబ్దుల్ హమీద్ భాస్కరరావు భవాని శంకర్ జిహెచ్ఎంసి చీఫ్ పిఆర్ఓ ముర్తుజా 32 జిల్లాల పౌర సంబంధాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.