సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ సత్తుపల్లి మండలం బుగ్గపాడులో జరుగుతున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్ట్ పనులు ముమ్మరంగా చేపట్టి, మూడు నెలల్లో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్ట్ క్రింద ఖమ్మం జిల్లాలో 21 కి.మీ., భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19 కి.మీ. మేర కాల్వ త్రవ్వకం పనులు జరుగుతున్నట్లు ఆయన అన్నారు. భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందజేత చర్యలు వెంటనే పూర్తి చేయాలన్నారు. బుగ్గపాడు, రుద్రాక్షపల్లి, యాతర్లపాడు గ్రామాల్లో ఎర్రచందనం చెట్లకు మూల్యాంకనం వెంటనే పూర్తి చేయాలన్నారు. టన్నెల్ పనుల్లో వేగం పెంచాలని ఆయన తెలిపారు. మెషినరీ, పనివాళ్లను పెంచాలని, పనులు త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా కల్లూరు ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ, ఇర్రిగేషన్ ఇఇ కె. సురేష్ కుమార్, డిఇలు చంద్రశేఖర్, మోతీలాల్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపిడిఓ సుభాషిణి, అధికారులు తదితరులు ఉన్నారు.
previous post