రంగారెడ్డి జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మానసిక వ్యాధితో బాధపడుతూ, మద్యానికి బానిసైన యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక సంఘటన ఇక్కడ జరిగింది. శ్రీ రాం(27) అనే యువకుడు మణికొండ పంచవటి కాలనీ కి చెందిన తన తల్లి తండ్రులతో కలిసి ఉంటున్నాడు. అతను మాదాపూర్ లో ఆటోమొబైల్ గ్యారేజ్ నిర్వహిస్తున్నాడు. అయితే శ్రీరాం గత పది సంవత్సరాలుగా మద్యానికి బానిసగా మారాడు. శ్రీరాం మానసికంగా బాధపడుతూ ఇంట్లో తల్లి తండ్రులతో గొడవ పడేవాడు. ఇంట్లో ని వస్తువులను పగులగొడుతూ,అర్ధరాత్రి వేళ గట్టిగా అరుస్తుండేవాడు.
నిన్న బయటకు వెళ్లి మద్యం తాగి ఇంటికి వచ్చిన శ్రీరాం మళ్లీ తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఈరోజు తెల్లవారుజామున తల్లి తండ్రులు నిద్రపోతుండగా శ్రీరాం తన గది నుండి బయటకు వచ్చి కత్తి తో గొంతు కోసుకున్నాడు. తల్లి తండ్రులు ఆపేందుకు ప్రయత్నించగా దగ్గరకు రానివ్వని శ్రీరాం తీవ్ర రక్తస్రావమై స్పాట్ లోనే మృతి చెందాడు. మృతుని తల్లి తండ్రులు ఇచ్చిన ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.