హామీ లను అమలు చేయడంలో పాలకులు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ తలపెట్టిన బస్సు జాతాను జయప్రదం చేయాలని పార్టీ గార్ల మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ కోరారు.
బస్సు జాతాను విజయవంతం కోరుతూ ముద్రించిన కరపత్రాలను గార్ల నెహ్రూ సెంటర్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకున్న ప్రతి ఒక్కరికీ,ఇండ్ల స్థలాలు లేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ నెల 18న మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో బస్సు జాతాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతున్న పేద వాడికి సొంత ఇంటి కల ఒక కల గానే మిగిలిందని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గృహా లక్ష్మీ పథకం లో అందజేస్తామన్న 3 లక్షల రూపాయలను, 5 లక్షల రూపాయలకు పెంచి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా లో గుడిసెలు వేసుకున్న 48 వేల మంది నిరుపేదల కు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, జీవో నెంబర్ 58 ప్రకారం ప్రభుత్వ భూములలో నివాసం ఉంటున్న పేదలకు క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు.
పేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు సాధనకు జరిగే రాష్ట్ర వ్యాప్తంగా 18 నుండి 27 వరకు జరగనున్న బస్సు యాత్ర ప్రారంభ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో నాయకులు,హమాలీ కార్మికులు బిక్షం, కోటయ్య, రాంబాబు, శ్రీనివాస్, రామకృష్ణ, ఎల్లయ్య, అంజయ్య, ప్రసాద్, సర్వేశ్వరరావు, సాయి, వెంకన్న,రాము తదితరులు ఉన్నారు.