ఖమ్మం జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ ఓ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వైరా నియోజకవర్గ నోడల్ ఆఫీసర్ బి.రాంబాబు పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గడల శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనెల 14వ తేదీన వైరాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల కోసం వైరా, కొణిజర్ల, కారేపల్లి, ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లోని పిహెచ్సి డాక్టర్లు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్ స్టాప్ తో పాటు సిబ్బంది వద్ద డిప్యూటీ డీఎంహెచ్ ఓ రాంబాబు లక్షలాది రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. దశాబ్ది ఉత్సవాల పేరుతో అక్రమంగా లక్షలాది రూపాయలు వసూలు చేసిన విషయo బహిర్గతం అయింది.
దీంతో కలెక్టర్ విపి గౌతమ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా డీహెచ్ గడల శ్రీనివాసరావు కూడా ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ఖమ్మం డీఎంహెచ్ ఓ మాలతి విచారణ నిర్వహించారు.
ఈ విచారణలో అక్రమ వసూళ్లకు పాల్పడిన విషయం నిజమేనని తేలడంతో డిప్యూటీ డీఎంహెచ్ఓ బి.రాంబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన అక్రమంగా వసూలు చేసిన నగదును తిరిగి డాక్టర్లు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్ స్టాప్ కు చెల్లించారు.
అక్రమ వసూళ్లు నిరూపణ కావడంతో డీహెచ్ గడల శ్రీనివాసరావు రాంబాబును సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు అధికారి ఆరోగ్య శాఖలోని మహిళా ఉద్యోగులపై ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఆయన ప్రవర్తనపై ఇప్పటికే మౌఖికంగా ఉన్నతాధికారులకు మహిళ ఉద్యోగులు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిసింది.