150 సీట్లు గెలిచామన్న ధీమా.. ఇంకో 20 ఏళ్లు తమకు తిరుగులేదనే అతి విశ్వాసం.. ఇవి ఏపీలో అధికార వైఎస్ఆర్ సీపీ ఎక్కువ కాలం నిలవలేదు. ఐదేళ్లలోనే ఆ పార్టీ అధిష్ఠానాన్ని, నేతలను నిరాశానిస్పృహలు ఆవహించాయి. కారణం.. అధికార దర్పం, డాబు. ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే ఏదో ఒకరోజు కాలమే సమాధానం చెబుతుందనడానికి వైసీపీ ఒక ఉదాహరణ. ఇంకొద్ది రోజుల్లో వైసీపీ ఓడిపోతుందనే సంకేతాలు బలంగా ఉన్నాయి. అధికారమదంతో విర్రవీగిన జగన్ మోహన్ రెడ్డి, విపక్షాలను నానా వేధింపులకు గురి చేసిన ఆయనకు ఈ శాస్తి జరగాల్సిందేనని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే గత ఎన్నికల వేళ జగన్ మోహన్ రెడ్డి వెంట ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు నడిచారు. ఆయన కోరకపోయినా జగన్ పైన అభిమానంతో పలువురు సినీ ప్రముఖులు తామంతతామే వచ్చారు. కానీ, అలా గతంలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వారు ఇప్పుడు ఎక్కడా కనబడడం లేదు. వాళ్లందర్నీ అవమానించి, వేధించడంతోనే వారు దూరమైనట్లుగా పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ తరపున స్టార్ క్యాంపెయినర్ల తరహాలో వచ్చే వారే కనిపించడం లేదు. దీంతో నియోజకవర్గాల్లో అభ్యర్థులు.. స్వతంత్ర అభ్యర్థుల తరహాలో తమ ప్రచారాన్ని ఒంటరిగా చేసుకుపోతున్నారు.
గత 2019 ఎన్నికలకు ముందు జగన్ కోసం సొంత ఫ్యామిలీ నుంచి తల్లి విజయమ్మ ప్రచారంలో పాల్గొన్నారు. సినిమా రంగం నుంచి మోహన్ బాబు, అలీ, ఫృథ్వీ, జీవిత రాజశేఖర్ ఇలా చాలా మంది ప్రచారం చేశారు. అప్పుడు వారు ఎన్నికలకు ముందు చాలా నియోజకవర్గాల్లో తిరిగారు. జగన్ మంచోడని.. రేపు తమకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో అంతా మద్దతు పలికారు. కానీ, ఇప్పుడు వీరిలో అందరూ దూరమయ్యారు. చివరికి అలీ కూడా ఆ మధ్య జగన్ కు సన్నిహితంగా కనిపించారు. కానీ, ప్రచారానికి రాకపోవడం గమనించదగ్గ విషయం.
ఇటు మోహన్ బాబు జగన్ ఫ్యామిలీకి బంధువు. వరుసకు జగన్ అల్లుడు అవుతాడని మోహన్ బాబే పది సార్లు చెప్పుకొనేవారు. అలాంటి మోహన్ బాబు కూడా దూరం జరిగారు. ఇప్పుడు ఆయన్ని ప్రచారానికి అడిగే ధైర్యం లేక వైసీపీ నేతలు నిమ్మకుంటున్నారు. ఇలా వైసీపీ దుస్థితి చూసి ఆ పార్టీ నేతలకే విరక్తి పుడుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జగన్ కు అధికారం వచ్చిన తర్వాతే అందరూ దూరమయ్యారని అంటున్నారు.
మరోవైపు కూటమి కోసం స్టార్ క్యాంపెయినర్లుగా ఫృథ్వీ, వరణ్ తేజ్, అంబటి రాయుడు, హైపర్ ఆది, సీరియల్ నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు ఎంతో మంది రంగంలోకి దిగి అభ్యర్థుల తరపున ప్రచారాలు చేస్తున్నారు. జగన్ అధికారం నెత్తికెక్కించుకోవడం వల్లే ఆయనకు అంతా దూరం అయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.