బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిందో.. నిరుద్యోగ యువత ఎంత బాధ పడుతుందో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తెలుసుకోవాలని రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు తో కలిసి పరిశీలించారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజీపీ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. హైదారాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ చేయడం కాదు.. బండి సంజయ్…ఢిల్లీలో మార్చ్ చేయు..దమ్ముంటే అని మంత్రి సవాల్ విసిరారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని, టీఎస్పీఎస్సీ, పోలీసు, సింగరేణి, గురుకులాలు, విద్యుత్, మెడికల్ హెల్త్ తదితర విభాగాల్లో మొత్తం 1,32,899 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు.
ఒక్క టీఎస్పీఎస్సీ ద్వారానే 30,594 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిందని, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 31,972 పోస్టులు జూనియర్ పంచాయతీ సెక్రెటరీలు 9,355, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 12,500, విద్యుత్ సంస్థల ద్వారా 6,648, డీసీసీబీలు 1571, టీఆర్టీ ద్వారా 8792, గురుకులాల్లో 11,500 టీచర్ పోస్టులను.. భర్తీ చేసిందని అన్నారు.
మొత్తంగా ఇప్పటి వరకు 1,32,899 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిందని స్పష్టం చేశారు. మరో 50 నుంచి 60వేల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నదన్నారు. ఉమ్మడి ఏపీలో అమల్లో ఉన్నప్పటి నాన్ లోకల్ విధానాన్ని రద్దు చేసి తెలంగాణ ప్రజలకే వంద శాతం ఉద్యోగాలు దక్కేలా చర్యలు చేపట్టిందని అన్నారు.
95శాతం ఉద్యోగాలు స్థానికులకు లభించేలా కొత్త జోనల్ విధానాన్ని తీసుకువచ్చారని, దీనికి గాను 317 జీవోను విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే దీని ప్రకారం, కొత్త ఖాళీలు గుర్తించి, నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికతో ఉందన్నారు.
అయితే దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ అనేక కుట్రలు పన్నుతున్నదని, తెలంగాణ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా చేస్తుందన్నారు. మీ ప్రభుత్వం హయాంలో… రాష్ట్రపతి ఉత్తర్వుల స్పిరిట్ తో, రాష్ట్రపతి నిబంధనలకు లోబడి జీఓ నెంబర్ 317 వచ్చిందని, ఆలాంటి దానిపై బిజెపి నేతలు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, విమర్శలు చేయడమే అన్నారు.
తెలంగాణలో ఒక్క ఖాళీ లేకుండా ఉండాలని, అన్ని జిల్లాల యువత ఉద్యోగ అవకాశాలు లభించాలన్నదే సిఎం కేసీఆర్ ఆకాంక్ష అని వివరించారు. దీనిని అడ్డుకునేందుకే బీజేపీ చిన్న విషయాన్ని భూతద్దంలో చూపెట్టి ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య చిచ్చుపెట్టి, ఆ మంటలో చలి కాచుకుంటున్నదని విమర్శించారు.