గత మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి దానిని పాటిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచామా, పదవిని అనుభవిస్తున్నామా, దొరికిన కాడికి వెనుకేసుకుండామా అన్న చందంగా ఉన్న ఈ రోజుల్లో చిట్యాల మున్సిపల్5వ వార్డు సభ్యురాలిగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన జడల పూలమ్మ చిన్నమల్లయ్య ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండి దానిని నెరవేరుస్తుంది.
ఎన్నికల సమయంలో పూలమ్మ తనను గెలిపిస్తే వార్డులో ఆడపిల్ల జన్మిస్తే ఆ అమ్మాయి పేర రూ.10 వేల 116 బ్యాంకులో డిపాజిట్ చేస్తానని వాగ్దానం చేసింది. ఎన్నికల్లో పూలమ్మ విజయం సాధించింది. వార్డులో గత15 రోజుల కాలంలో ముగ్గురు మహిళలు ఆడపిల్లలకు జన్మనిచ్చారు.
విషయం తెలుసుకున్న పూలమ్మ ముగ్గురు చిన్నారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల 116 బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఆదివారం మాతృ దినోత్సవం రోజున వారింటికి వెళ్లి మాతృ మూర్తులకు డిపాజిట్ పత్రాలను అందజేశారు పూలమ్మ దంపతులు. అన్న మాట ప్రకారం ఆడపిల్లకు ఆర్థిక సహాయం అందించిన పూలమ్మ చిన్న మల్లయ్య దంపతులను వార్డు సభ్యులు, పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.