కోవిద్ -19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సహకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక శాసనసభ్యులు మిరాజ్ హుస్సేన్, డి జి పి మహేందర్ రెడ్డి, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతమహంతి, సి పి.అంజనీ కుమార్ లతో కలిసి ఖైరతాబాద్ జోన్ లోని మల్లేపల్లి ( నాంపల్లి )లో పర్యటించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ కోవిద్ -19 నియంత్రణకు నగరంలో 12 కంటైన్మెంట్ క్లస్టర్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్లస్టర్ల పరిధి లోని ప్రజలు బయటకు రాకూడదని కోరారు. అలాగే బయటి వ్యక్తులు కూడా కంటైన్మెంట్ ప్రాంతంలోకి వెళ్లకూడదని సూచించారు.
ఈ నిబంధనల అమలుకు పూర్తిగా బారికేడింగ్ చేసి, వైరస్ ను ఎక్కడ కక్కడ కట్టడి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. లోపల వున్న వారి సమస్యలను తెలియజేయుటకు ప్రత్యేక నెంబర్ ను కేటాయించ నున్నట్లు తెలిపారు.ఇప్పటివరకు 12 కంటైన్మెంట్స్ ప్రకటించినట్లు తెలిపారు.
కంటైన్మెంట్ నిబంధనల అమలును మానిటరింగ్ చేసేందుకు ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించాలని జి హెచ్ ఎం సి కమీషనర్ కు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన చర్యలను అమలు చేయాలని జోనల్, డిప్యూటీ కమీషనర్లు ఆదేశించారు. కోవిద్ -19 వ్యాప్తిని అరికట్టుటలో ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కు ప్రజలందరూ పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇదేవిధంగా ఇకముందు కూడ వ్యవహరించాలని కోరారు. ఈ పర్యటనలో జోనల్ కమీషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ మాజీద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.