తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎండనకా, వాననకా తనతో కార్యకర్తలు నిలిచారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ట్వీట్ చేశారు.తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెప్పారు. తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఎమోషనల్ ట్వీట్ చేశారు.
అన్ని మోర్చాల నాయకులు, సంగ్రామ సేన, రాష్ట్ర పార్టీ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, సోషల్ మీడియా యోధులు, తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా కరీంనగర్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని భావోద్వేగంతో ట్వీట్ చేశారు. కేసీఆర్పై పోరాడి అరెస్టయిన సమయంలో, తనపై దాడి జరిగిన సమయంలో, తన కష్టాలు, సంతోషంలోనూ అన్ని వేళలా అండగా నిలిచారని వెల్లడించారు.
కార్యకర్తల జీవితాల్లో తాను ఒక విషాద గాథగా నిలవకపోవడం తనకు సంతోషాన్నిచ్చిందన్నారు. జీవితంలో కొన్ని అధ్యాయాలు మూతపడకుండానే మూసుకు పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన కిషన్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వంలో తాను నూతనోత్సాహంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పారు.
తనలాంటి సాధారణ కార్యకర్తకు మూడేండ్లకు పైగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఛాన్స్ ఇచ్చారని, అందుకు ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, శివప్రకాశ్ జీ, తరుణ్ చుగ్, బన్సల్, అర్వింద్ మీనన్కు ధన్యవాదాలు తెలిపారు.