అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలోని శ్రీసౌమ్యనాథస్వామి కల్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది.ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి, మేడా విజయ బాస్కర్ రెడ్డి పద్మజా దంపతులు కల్యాణంకు ముత్యాల తలంబ్రాలు తీసుకు రాగా వారికి ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతం పలికారు.
భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో కల్యాణ వేదికను అలంకరించారు.వైఖానస ఆగమశాస్త్ర పండితులు శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల మంత్రోచ్ఛారణలు,భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయం భక్తి పారవశ్యంతో నిండిపోయింది.
తిరుమల తిరుపతి దేవస్థానం గాయకురాల భక్తిసంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. వైకానస ఆగమశాస్త్ర పండితులు, ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో మాంగళ్యధారణ, ముత్యాల తలంబ్రాల క్రతువు నిర్వహించారు. కల్యాణానికి విచ్చేసిన భక్తులకు బ్రహ్మోత్సవ కమిటీ నిర్వాహకులు ముత్యాల తలంబ్రాలను అందజేశారు.
టీటీడీ శ్రీవారి లడ్డు ప్రసాదాలను విక్రయించారు. పోలీ సులు భారీబందో బస్తును ఏర్పాటు చేశారు. కల్యాణానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం నందలూరు జనసైనికుల ఆధ్వర్యంలో బస్టాండు నుంచి ఆలయం వరకు ఉచితంగా ఆటోలను ఏర్పాటు చేశారు.
అంతే కాకుండా యువనేత మేడా విజయ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు. జనసేన అత్తిగారి దినేష్ ఆధ్వర్యంలో మజ్జిగ మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేసారు.నంద లూరు బస్ స్టాండ్ నుంచి ఆలయం వరకు రంగు రంగుల విద్యుత్ దీప కాంతులు, వివిధ దేవతా మూర్తుల లైటింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు.