ప్రజల ఆరోగ్యానికి… సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పని చేయాలని, సత్వర సేవలందించాలని బొండపల్లి మండల స్థాయి అధికారులను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశించారు. అంగన్వాడీల ద్వారా గర్భిణులకు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేయాలని సూచించారు. ఇంటింటికీ రేషన్ వాహనాల ద్వారా ప్రజలకు ఫోర్టిఫైడ్ రైస్ను పంపిణీ చేయాలని పేర్కొన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు.ఈ మేరకు కలెక్టర్ సూర్యకుమారి బొండపల్లి గ్రామ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా అంగన్వాడీ కేంద్రం -3ను సందర్శించి అక్కడ సేవలను పరిశీలించారు. కేంద్రానికి వచ్చిన గర్భిణులతో, చిన్నారులతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు.
పోషన్ కిట్లను, బాలామృతం, గుడ్లు, పాలు, జొన్నపిండి ఇతర ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా గర్భిణులకు, చిన్నారులకు అందజేయాలని ఐసీడీఎస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. జనరల్ వార్డును, నవజాత శిశు కేంద్రాన్ని, రక్త పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేశారు.
హెచ్.బి. శాతం తక్కువగా నమోదయ్యే పిల్లలపై, మహిళలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. రక్త హీతన సమస్య తలెత్తకుండా ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై, ఆహార నియమావళిపై అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణుల వివరాల నమోదు ప్రక్రియను సజావుగా చేయాలని, వారి ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
నిర్ణీత వ్యవధిలోగా భవనాలను అందుబాటులోకి తీసుకురండి
అంగన్ వాడీ కేంద్రం, పీహెచ్సీ సందర్శన అనంతరం కలెక్టర్ సూర్యకుమారి స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులతో, సచివాలయ ఉద్యోగులతో కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. దాదాపు పూర్తయిన భవనాలను నిర్ణీత వ్యవధిలోగా అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలను త్వరితగతిన నిర్మించి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఇప్పటి వరకు అయిన పనులపై ఈ సందర్భంగా శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఇంటింటికీ కుళాయిలు వేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
తడి పొడి చెత్తను వేరు చేయాలి
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడబడితే అక్కడ చెత్త వేయకుండా, తడి పొడి చెత్తను వేరు చేసి బుట్లలో వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. కల్యాణ మండపాల వద్ద వివాహాలు, ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు ఎక్కువగా వ్యర్థాలు వేస్తున్నారని పంచాయతీ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా అద్దె డబ్బులు వసూలు చేసి గ్రీన్ అంబాసిడర్ల ద్వారా వ్యర్థాలను తొలగించాలని సూచించారు.
యూనిఫాం ధరించని సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
యూనిఫాం ధరించని సచివాలయ సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనిఫాం ధరించటం నామోసి కాదని.. ప్రత్యేక గుర్తింపు అని పేర్కొన్నారు. కన్వర్జెన్స్ సమావేశానికి హాజరైన కొంతమంది సచివాలయ సిబ్బంది యూనిఫాం ధరించకపోవడాన్ని గమనించిన కలెక్టర్ ఈ మేరకు స్పందించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా యూనిఫాం దుస్తులు ధరించే విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో బొండపల్లి మండల స్పెషల్ ఆఫీసర్, ఐసీడీఎస్ పీడీ బి. శాంత కుమారి, జిల్లా వైద్యారోగ్య అధికారి ఎస్.వి. రమణ కుమారి, బొండపల్లి ఎంపీడీవో త్రివిక్రమ రావు, తహశీల్దార్ శ్రీనివాస మిశ్రా, కేర్ ఇండియా జిల్లా కో-ఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం, గృహ నిర్మాణ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్ ఏఈలు, ఉపాధి హామీ ఏపీవో, సచివాలయ ఇంజీనిరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.