తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి మంత్రి ఈటల రాజేందర్ కేంద్రంలోని బిజెపిని విమర్శిస్తున్నారని రాజన్న సిరిసిల్లా జిల్లా బిజెపి నాయకుడు ఎర్రం మహేష్ అన్నారు.
కేంద్రం సాయం చేయడం లేదని మంత్రి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఐదు ఆక్సిజన్ ప్లాంట్లకు నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని ఎర్రం మహేష్ అన్నారు.
కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. దీన్ని కప్పి పుచ్చుకోవడానికి కేంద్రాన్ని విమర్శిస్తున్న మంత్రి తాను ఏం చేశారో చెప్పాలని ఆయన అన్నారు.
అన్ని విషయాలూ కేంద్రం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గుడ్డి గుర్రాలకు పళ్లుతోముతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజా ఆరోగ్యంపై ఏ మాత్రం శ్రద్ధను టీఆర్ఎస్ ప్రభుత్వం చూపడం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నందున వందలాది మంది చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. అంతా బిజెపి చేస్తే మీరెందుకు? అవినీతి చేయడానికా? అని ఆయన ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ తెలంగాణలో ఎన్నో జిల్లా ఆసుపత్రుల స్థాయి కూడా పెంచలేదని మహేష్ అన్నారు.
మెరుగైన వైద్య సౌకర్యం అందించలేదని, ప్రజల ఆరోగ్య భద్రత గురించి ఏ మాత్రం చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. అధికార పార్టీ నాయకుడి తల్లినే వైద్యులు పట్టించుకోలేదని దాంతో ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ నాయకుడే విమర్శించారని మహేష్ గుర్తు చేశారు.
గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఏ మాత్రం సౌకర్యాలు లేవని పత్రికా విలేకరులే చెబుతున్నారని, అయినా ఈటెల రాజేందర్ మంత్రిగా ఏమీ చేయలదని మహేష్ అన్నారు.
తెలంగాణ లోని చాలా ఆసుపత్రుల్లో వైద్యులు ఉంటే బెడ్స్ లేవు… బెడ్స్ ఉంటే వైద్యులు లేరని ఆయన అన్నారు. కరోనా వచ్చిన తర్వాత గత ఏడాది నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఆపి రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు మెరుగు పరిచేందుకు ఈటెల రాజేందర్ ప్రయత్నించాలని మహేష్ హితవు పలికారు.