దేశ రాజధాని దిల్లీ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముుఖర్జీ నగర్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్ లో మంటలు చెలరేగాయి. దీంతో భయభ్రాంతులకు గురైన విద్యార్థులు వెంటనే బయటకు పరుగులు తీశారు. కొందరు విద్యార్థులు కిటికీల నుంచి తీగలను పట్టుకుని కిందకు దిగారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ప్రమాదం జరిగిన కోచింగ్ సెంటర్ మూడో అంతస్తులో ఉంది. గదిలో పొగలు రాగానే విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వెనుకవైపు ఉన్న కిటికీల నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. భవనానికి ఉన్న తీగలను పట్టుకుని కిందకు దిగారు.
కొందరు పట్టుతప్పి కిందకు పడిపోయినట్లు ఆ వీడియోల్లో కన్పించింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. విద్యార్థులను కాపాడారు..
ఎలక్ట్రిక్ మీటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడగా.. మిగిలిన వారు సురక్షితంగా కిందకు దిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు…….