విజయవాడ నగర సి.పి. రాణాను, ఐ.జి. రవిప్రకాష్ ను ఆదేశించిన సీఈఓ మీనా
సీఎం జగన్ రెడ్డి పై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ సమీపంలో శనివారం రాయితో దాడి చేసిన కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ నగర సి.పి. కాంతి రాణా టాటాను, ఐ.జి. రవిప్రకాష్ ను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబరులో వారిరువురితో ఆయన సమావేశమై ఘనటనకు సంబంధించిన పూర్వాపరాలపై సమీక్షించారు.
మేమంతా సిద్దం బస్సు యాత్రలో ఇటు వంటి దుర్ఘటన ఏ విధంగా చోటు చేసుకుంది, దాడి చేసేందుకు నిందితులకు ఏ విధంగా అవకాశం ఏర్పడింది, పూర్తి స్థాయిలో బందోబస్తు ఉన్నప్పటికీ నిందితులు ఏ విధంగా రాయితో దాడి చేయగలిగారు అనే విషయాలపై పోలీస్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్న కొంతమంది నిందితుల విచారణ ఏ విధంగా సాగుచున్నది, ఆ విచారణలో బయటపడిన విషయాలపై ఆయన ఆరాతీశారు.
ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసి సమగ్ర నివేదికను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రముఖ వ్యక్తుల పర్యటనల్లో ఇటు వంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలనే ఆవశ్యకతను ఆయన నొక్కిచెపుతూ, అందుకు తగ్గట్టుగా రాష్ట్ర స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశంపై ఆయన ఆరాతీశారు. ఈ దుర్ఝటనకు సంబందించిన పూర్వాపరాలు, ప్రస్తుతం జరుగుచున్న దర్యాప్తు ప్రగతిని వీడియో విజ్యువల్స్, ఫొటోల ద్వారా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు.