ఇసుక రీచ్ లున్న గ్రామాలలో అభివృద్ధి కోసం గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు పంపించినట్లయితే గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులను ఇసుక కమిటీ నుండి ఇస్తామని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష వెల్లడించారు.
సోమవారం సాయంత్రం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా శాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఇసుక రీచుల సహాయకుల పనితీరు సరిగా లేనందున 24 గంటలు రెవెన్యూ నిఘా ఉండేలా వీఆర్ ఏల తో నిఘాఏర్పాటు చేయాలని చెప్పారు.
గతంలో ఇసుక రీచ్ లు ఉన్న అన్ని వనరుల వద్ద ఇసుక సాంకేతిక కమిటీ ద్వారా హద్దులు ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే వాటిని శాశ్వతంగా పిల్లర్లతో ఏర్పాటు చేయాలని రెవెన్యూ ,భూమి కొలతల శాఖ అధికారులను ఆదేశించారు.
అక్రమ ఇసుక రవాణా పై సర్పంచులు ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. ఆయా ఇంజనీరింగ్ శాఖలు ప్రభుత్వ నిర్మాణాలకు అవసరమైన ఇసుక అంచనాలు రూపొందించి పంపినట్లయితే అవసరమైన ఇసుకను రిజర్వ్ చేసి ఉంచడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు.
వినియోగ దారులకు నాణ్యమైన ఇసుకను మాత్రమే సరఫరా చేయాలని, ఒక అనుమతి పై ఓకే ట్రిప్పు మాత్రమే ఇవ్వాలని,ఒక వేళ అధిక ట్రిప్పులు అనుమతి ఇచ్చినట్లయితే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ,జిల్లా మైనింగ్ ఇంచార్జ్ అధికారి విజయ కుమార్, ఆర్డిఓ అమరేందర్ ,ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, సర్పంచులు హాజరయ్యారు.
పోలిశెట్టి బాలకృష్ణ